నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి… హైదరాబాద్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. సీఎం కేసీఆర్కి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని సూచించారు.
మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, వర్థంతి సందర్భంగా ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారా? అని ప్రశ్నించారు భరత్.. అసలు అంబేద్కర్ అంటే కేసీఆర్కు గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలోనే ఇందని గుర్తుచేసిన ఆయన.. ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు.. అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తక్షణమే అంబేడ్కర్ విగ్రహంవద్ద ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.