NTV Telugu Site icon

Yadadri: ప్రైవేట్‌ వాహనాలకు నో పర్మిషన్‌.. రేపటి నుంచి బస్సులోనే..

యాదాద్రిలో పునర్ నిర్మించిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి… క్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది… యాదాద్రిలో పునర్‌ నిర్మితమైన అద్భుతమైన ఆలయాన్ని చూసి పరవశించిపోతున్నారు భక్తులు.. ఇప్పటికే ఆలయంలోనిర్వహించే వివిధ రకాల పూజలు, దర్శనాలకు సమయాలను ప్రకటించిన అధికారులు.. మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్రమంగా అన్ని సదుపాయాలను కల్పించే పనిలో పడిపోయారు.. అందులో భాగంగా.. రేపటి నుంచి యాదాద్రి కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించనున్నారు.. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలు కొండ కిందే పార్క్ చేయాలని ఆలయ అధికారుల ఆదేశాలు జారీ చేశారు.

Read Also: TSRTC: ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వారికి ఉచిత ప్రయాణం

సొంత వాహనాల్లో కాకుండా యాదాద్రి కొండ‌పైకి ఇక నుంచి ఆర్టీసీ బ‌స్సుల్లోనే వెళ్లాల‌ని ఆల‌య ఈవో గీత వెల్లడించారు.. కొండ‌పైకి ప్రైవేటు వాహ‌నాల‌ను యాదాద్రి దేవ‌స్థానం నిషేధించింది.. దీంతో.. ఉచితంగా దేవ‌స్థానం ఏర్పాటు చేసే ఆర్టీసీ బ‌స్సుల్లోనే భ‌క్తుల‌ను కొండ‌పైకి త‌రలిస్తామ‌ని తెలిపారు.. రేప‌టి నుంచే ఆర్టీసీ బ‌స్సుల ద్వారా కొండ‌పైకి భ‌క్తుల‌ను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇక, భ‌క్తుల త‌ర‌లింపున‌కు అయ్యే ఖర్చు మొత్తం దేవ‌స్థాన‌మే భరించనుంది.. మరోవైపు.. యాదాద్రి ఆల‌యంలో స్వామివారి నిత్యక‌ల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత క‌ల్యాణం.. ఇలా మరికొన్ని ప్రత్యేక సేవలను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ఈవో గీత పేర్కొన్నారు.