Site icon NTV Telugu

Telangana: బీసీ గురుకులాల్లో చేరే విద్యార్థులకు శుభవార్త

Gurukul

Gurukul

బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో 2022-23 వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

డిగ్రీ కోర్సుల కోసం కేవలం బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 5న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తామని ఆయన వివరించారు. ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉండాలన్నారు. డిగ్రీలో చేరాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ లేక, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో 2021-22 సంవత్సరంలో ఇంటర్ చదివి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/- కు మించరాదని తెలిపారు.

పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ను చూడాలని మల్లయ్య బట్టు సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయం కార్యాలయ ఫోన్ నెంబరు 040-23322377, 23328266లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

IPL 2022: బుమ్రా పాంచ్ పటాకా వృథా.. ముంబైకి 9వ ఓటమి

Exit mobile version