NTV Telugu Site icon

Minister Seethakka: మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. భక్తులకు ఇబ్బంది కలగొద్దని ఆదేశం

Seethakka

Seethakka

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అంతకుముందు జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించారు. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం అని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సీతక్క తెలిపారు. అనంతరం అధికారులు, మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమయ్యారు. ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా.. వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని అన్నారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని.. అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read Also: Nellore: మైనర్ విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం..

మరోవైపు.. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, చోరీ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సీతక్క తెలిపారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని.. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని.. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు.. హనుమకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని.. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని మంత్రి సూచించారు.

Read Also: Thandel : తండేల్ సక్సెస్ పై నాగార్జున రియాక్షన్.. సోషల్ మీడియాలో పోస్ట్