Mulugu Rains : ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా వాజేడు మండలంలో అత్యధికంగా 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి వాజేడు మండలంలోని దాదాపు 25 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఇసుక వాగు ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
హైదరాబాద్ – భూపాలపట్నం (ఛత్తీస్గఢ్) 163 జాతీయ రహదారిని రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారులోని ఇసుక వాగుపై ఉన్న పాత వంతెనను తొలగించి, నూతన వంతెన నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే, ప్రయాణికుల రాకపోకల కోసం పక్కనే తాత్కాలికంగా నిర్మించిన డైవెర్షన్ అప్రోచ్ రోడ్డు ఇసుక వాగు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణలోని 25 గ్రామాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ పరిశీలన – భద్రతా చర్యలు
విషయం తెలుసుకున్న ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు వద్దకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాగు ఇరువైపులా భారీ గేట్లు, ‘నో ఎంట్రీ’ బోర్డులు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
నాలుగేళ్లుగా సాగుతున్న వంతెన నిర్మాణంపై నిరసన
చీకుపల్లి వద్ద పాత వంతెనను కూల్చివేసి నూతన వంతెన నిర్మాణం చేపట్టి నాలుగు నెలలు దాటుతున్నా, నేటికీ పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తి కాకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే నేడు కొద్దిపాటి వర్షాలకే రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.

