NTV Telugu Site icon

Minister KTR: బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్.. ఆడియో లీక్

Ktr Jagannadham Phone Call

Ktr Jagannadham Phone Call

Minister KTR Talks With BJP Leader Jagannadham Audio Leaked: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలన్నీ ఏ స్థాయిలో శ్రమిస్తున్నాయో అందరికీ తెలుసు! ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే.. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామంటూ వాగ్ధానాలు చేస్తున్నారు. ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు చేయాల్సిన కసరత్తులు, ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ బీజేపీ నేతతో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. గట్టుప్పల్ బీజేపీ ఇన్ఛార్జ్ జగన్నాథంకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలని కోరారు.

ఆ ఫోన్ కాల్‌లో ఏముందంటే.. ‘‘ఈ ఒక్క మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాల గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఏనాడైనా నియోజకవర్గాన్ని పట్టించుకున్నాడా? ప్రజలను పట్టించుకున్నారా? అనే విషయాలను మీ అనుభవానికి నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ.. రాజగోపాల్ రెడ్డి ఏమైనా పాత ఆర్ఎస్ఎస్ మనిషో, పూర్తిస్థాయి బీజేపీ నేతనో అయ్యుంటే అది వేరే విషయం అయ్యేది. కేవలం తన అవసరాల కోసమే పార్టీ మారాడే తప్ప.. మోడీ మీదనో, ఇంకెవరి మీద ప్రేమతోనో మారలేదు. గట్టుప్పల్‌లో మీరు నాకు సహకరిస్తే.. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. నియోజకవర్గాన్ని కూడా దత్తత తీసుకుంటానని చెప్పా. నేను పని చేసే మీ సహకారాన్ని అడుగుతున్నానే తప్ప.. డొల్ల మాటలు చెప్పి అడగట్లేదు. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి’’ అని కేటీఆర్ చెప్పారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘‘నియోజకవర్గంలో మీ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉందని మావాళ్లు చెప్పారు. మీరొక్కరు సహకరిస్తే చాలు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేల మందికి పెన్షన్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ కూడా వచ్చింది. ఇది నాకోసమో, మీకోసమో కాదు.. నియోజక అభివృద్ధి కోసమే సహకారం కోరుతున్నా. మీలాంటి వాళ్లు ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ పని చేయాలని అనిపిస్తుంది’’ అని కేటీఆర్ చెప్పారు. మధ్యలో ఓసారి జగన్నాథ్ జోక్యం చేసుకొని.. రైతు బంధు పథకం పెద్ద రైతుల కంటే చిన్న రైతులకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంభాషణను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఫోన్లు చేస్తూ విపక్ష నేతలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.