Minister KTR Fires On Kishan Reddy Over Centre Funds: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వరద సహాయంపై కిషన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక నిధులపైన కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని కౌంటర్ వేశారు. ఎన్డీఅర్ఎఫ్ ద్వారా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 280 ప్రకారం.. రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా, హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తుల్లేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు వస్తాయని.. కానీ కిషన్ రెడ్డి మాత్రం తాము వాటిని ప్రత్యేకంగా ఇస్తున్నట్టు అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు తప్ప.. కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కిందేమిటో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని లోక్సభలో కేంద్ర హోంశాఖ నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారో కిషన్ రెడ్డి చెప్పాల్సిందేనని మంత్రి కేటీఆర్ అడిగారు.
