Minister Jagadish Reddy Counter on Amit Shah Speech: ఎప్పుడూ ఆధారం లేని ఆరోపణలు చేసే బండి సంజయ్ పాత్రను, ఈరోజు అమిత్ షా పోషించారంటూ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. అవే అబద్ధాలు , అవే అర్థం లేని మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కడం తప్ప.. అమిత్ షా మాటల్లో ఏమీ లేదన్నారు. శనివారం మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదన్నారు. అసలు సమాధానం ఉండవనే విషయం తమకు ముందే తెలుసన్నారు. బిజెపి అధినాయకుడే కెసిఆర్కు సమాధానం చెప్పే పరిస్థితులు లేదని దుయ్యబట్టారు. ఉన్న విషయాన్ని ఒప్పుకునే ధైర్యం బిజెపికి లేదన్నారు.
అమిత్ షా మాటలు దిగజారుడుతనంగా ఉన్నాయని.. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ఫక్తు రాజకీయాలు, ఓట్లు-సీట్లు, అధికారం తప్ప.. వాళ్లకు ఇంకో యావ లేదన్నారు. అమిత్ షా మాటలతో ఈ రాష్ట్రానికి గానీ, మునుగోడు ప్రజలకు గానీ ఒరిగిందేమీ లేదని చురకలంటించారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ లేకుండా చేస్తారన్నారు. కాగా.. తన ప్రసంగంలో భాగంగా కేసీఆర్ను గద్దె దించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని మరిచారన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
