Site icon NTV Telugu

Harish Rao: విద్యుత్ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్ ఎందుకు నోరెత్తడం లేదు?

బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు.

Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు.. 24 గంటల డెడ్‌లైన్‌..!

అటు కాంగ్రెస్ పార్టీ అతీగతీ లేని పార్టీ అని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 40వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నాయకులు ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యుత్ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడంలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. మెడ మీద కత్తి పెట్టినా బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పినట్లు హరీష్‌రావు గుర్తుచేశారు. విద్యుత్ సంస్కరణలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. కాగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి హరీష్‌రావు పాల్గొని రక్తదానం చేశారు.

Exit mobile version