Fraud : డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట భారీ మోసం..

  • డబుల్ బెడ్రూం ఆశ చూపి రూ.5 కోట్లు వసూలు చేసిన నాగరాజు
  • నాగరాజు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులు
  • డబ్బులు తీసుకొని, కాలయాపన చేసిన నాగరాజు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. కేసు నమోదు
Double Bedroom

Double Bedroom

Fraud :సొంత ఇంటి కలలు కంటున్న అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన మేడిపల్లిలో వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఆశ చూపుతూ ఒక వ్యక్తి సుమారు 100 మందికిపైగా వ్యక్తుల నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేశాడు. నాగరాజు అనే వ్యక్తి మూడు సంవత్సరాల కాలంగా ఈ మోసం చేస్తూ తప్పించుకుంటున్నట్లు బాధితులు తెలిపారు. నాగరాజు తనను ప్రభుత్వ డబుల్ బెడ్రూం స్కీం‌లో సంబంధాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటూ, ఒక్క ఇంటికో ఐదు లక్షల రూపాయలు అడిగి డబ్బులు వసూలు చేశాడు. కొంతమంది వద్ద మూడు సంవత్సరాల క్రితమే, మరికొందరిని రెండేళ్ల క్రితం, ఇంకొందరిని ఏడాది క్రితం ఇలా క్రమంగా డబ్బులు తీసుకున్నాడు.

Trump Tariff: అమెరికా 50% టారిఫ్ నిర్ణయం.. భారత్‌లో కీలక పరిణామాలు

నాగరాజు ఇంటి వద్దకు వెళ్లిన బాధితులు అక్కడ అతను లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. “రెక్కాడితే డొక్కడిన బ్రతుకులు మావి. సొంత ఇంటికోసం ఎన్నో ఆశలతో డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు మోసపోయాం” అని బాధితులు వాపోయారు. అమృత కాలనీలో ఉన్న నాగరాజు ఇంటి వద్ద ఆందోళన జరిగిన విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. బాధితులు ఆ వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

AP Free Bus Travel Scheme: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. మహిళలు తప్పకుండా ఇవి తెలుసుకోవాలి..!