హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తున్నా.. మొత్తంగా మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నారు.. ఇక, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోతోంది.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ నడుస్తున్నా.. కాంగ్రెస్ లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఈ ఫలితాలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఇలా స్పందించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షిస్తామన్నారు మాణిక్కం ఠాగూర్… ఇక, పార్టీలో చర్చించిన తరువాతే ఈ విషయం పై స్పందిస్తామని స్పష్టం చేసిన ఆయన.. ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు నేను ఇంకా చూడలేదు అన్నారు.. ఆ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాతే స్పందిస్తానన్నారు. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలు కేవలం వారి ఊహలేనని వ్యాఖ్యానించిన ఠాగూర్.. అన్ని అంశాలపై పార్టీలో సమీక్ష చేసుకుని మాట్లాడదాం అన్నారు.