హైదరాబాద్ లో భారీ వర్షాలకు పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ గంజ్ లోని మహబూబ్ మేన్షన్ ప్యాలెస్ చూస్తుండగానే కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానిపోయింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. దీంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.