ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ గురించి చెప్పడానికి తెలంగాణ వస్తున్నావా రాహుల్ అంటూ… మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పందిస్తూ.. తెలంగాణకు ద్రోహం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్లు ఏ పార్టీ నుంచి వచ్చారో మంత్రి హరీష్ రావు సోయితెచ్చుకోని మాట్లాడాలన్నారు.
టీడీపీ పార్టీ నుంచే పుట్టుకొచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అని, ఆ పార్టీ నుంచి వచ్చిన మీరా మమ్మల్ని ప్రశ్నించేది అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా.. సిగ్గు, శరం ఉండా హరీష్ రావు మాట్లాడడానికి అంటూ ఆయన ధ్వజమెత్తారు. మామ, అల్లుడు పోయి బాబు అంటూ కాళ్లపైన పడిన విషయం మరిచిపోయారా అంటూ మధు యాష్కీ గౌడ్ ప్రశ్నించారు.
