KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి వాటాల వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని కమిటీ నిర్ణయించింది.
తాగునీటి పంపిణీపై తెలంగాణ ప్రతిపాదనలు
సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు మాట్లాడుతూ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి పంపిణీని 50:50 రేషియో ప్రాతిపదికన చేపట్టాలని కమిటీ ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా చేపడుతున్న నీటి వాడకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఇప్పటికే తమ వాటా కంటే అదనంగా 10 టీఎంసీల నీటిని వాడుకుందని, ఇకపై అక్కడ నుంచి నీటిని వాడబోమని ఏపీ అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాల సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా చర్చించేందుకు సెప్టెంబర్ 4వ తేదీన మరొక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
నీటి వినియోగంపై ఏపీ స్పందన
ఏపీ ఈఎన్సీ నరసింహ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల తాగునీటి ప్రాధాన్యతపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఏడాది మొత్తం నీటి వినియోగానికి సంబంధించిన నివేదికను తెలంగాణ అందించగా, ఏపీ మాత్రం అక్టోబర్ నెల వరకు అవసరమైన నీటి పంపిణీకి ప్రతిపాదనలు పెట్టింది. రాబోయే కాలానికి సంబంధించి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరగా, దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో నీటి వాటాల నిష్పత్తికి సంబంధించిన అంశం చర్చకు రాలేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సమ్మతించిందని ఏపీ ఈఎన్సీ వెల్లడించారు.

