అనాధ పిల్లలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్‌ సర్కార్‌

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనాధ పిల్లల భవిష్యత్‌ కోసం బలమైన పునాది వేసేలా, వారికి అన్ని తానై విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా సర్కార్‌ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో అనాధ పిల్లలకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తుంది.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం రెండు రోజులు వేదిక్‌ మ్యాథ్స్‌, అడ్వాన్స్‌ ఇంగ్లీష్‌, యోగ, వ్యక్తిత్వ వికాసం, వ్యాసరచన, డ్రాయింగ్‌, కలలు, సంస్కృతులపై అవగాహన కల్పించనున్నట్టు సర్కార్‌ తెలిపింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణను మొదటగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించి, త్వరలోనే అన్ని జిల్లాకు విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పిల్లలకు ఏదైనా ఆపద సంభవిస్తే అత్యవసర వినియోగానికి జిల్లాకో వాహనాన్ని కేటాయించింది. రాష్ర్టంలోని అన్ని శిశువిహార్‌, బాల సంరక్షక కేంద్రాల్లోని పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.