అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లలో చనిపోతారని భావిస్తున్న కొందరి చేత బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్ము కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేదో సినిమా కధలా అనిపిస్తుంది కదూ.. కానీ అలా అనిపించినా అదే నిజం. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురు మనుషులను మట్టుబెట్టిన విషయం కూడా తెలిసి పోలీసులు షాకయ్యారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నల్గొండ జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించి, ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు.
వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకవేళ కట్టలేమని చెప్తే ఒకటి రెండు ప్రీమియంలు కూడా వారే చెల్లించేస్తారు. ఆ తర్వాత ముఠా సభ్యులు బీమా చేయించుకున్న వ్యక్తి నామినీ ని డబ్బు పేరిట టెంప్ట్ చేసి ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేసి వాహనం ఎక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబ సభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి రావడానికి ఒక ఇల్లీగల్ అఫైర్ కారణం అయింది. దామచర్ల మండలంలోని కొండ్రపోల్కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను ఆయన భార్య నమ్మించింది. అయితే, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసి ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వారు కోటిరెడ్డి భార్యని అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని తమదైన శైలిలో విచారించడంతో బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.