హైదరాబాద్లోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల (టవర్స్) కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఆగస్టు 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ లాటరీ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు.
లాటరీ నిర్వహణ, ప్రత్యక్ష ప్రసారం
హైదరాబాద్ నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల చొప్పున నాలుగు రోజుల పాటు డ్రా తీసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ విధానంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు, ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రత్యేక అధికారి వీపీ గౌతం తెలిపారు. దీనివల్ల ప్రజలు ఇంట్లో నుంచే పారదర్శకంగా జరుగుతున్న ఎంపిక విధానాన్ని చూడవచ్చు.
దళారుల మాటలు నమ్మొద్దు.. అధికారుల హెచ్చరిక
ఈ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పొలిటికల్ సిఫారసులు లేదా మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు. “ఇండ్లు ఇప్పిస్తాం” అంటూ డబ్బులు వసూలు చేసే దళారుల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని హౌసింగ్ బోర్డు విజ్ఞప్తి చేసింది. కేవలం అర్హత కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా పూర్తి పారదర్శకతతో ఇండ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.
అర్హులందరికీ తదుపరి విడతల్లో అవకాశం
ఒకవేళ ఈ విడత లాటరీలో పేరు రాకపోయినప్పటికీ అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీపీ గౌతం తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ కేవలం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని, భవిష్యత్తులో నిర్మించే తదుపరి విడత టవర్లలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నగరం పరిధిలో మొత్తం లక్ష ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు.

