Site icon NTV Telugu

Chicken Shops Shut Down: నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. నేటి నుంచి చికెన్‌ సెంటర్లు బంద్..

Chicken Shops Shut Down

Chicken Shops Shut Down

Chicken Shops Shut Down: నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్.. రిటైల్‌ చికెన్‌ సెంటర్లకు ఇచ్చే మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్‌ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్‌ను పెంచాలని డిమాండ్‌ చేస్తోంది చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌. చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని, తమకు వచ్చే మార్జిన్ అస్సలు సరిపోవడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో చికెన్‌పై 30 నుంచి 35 రూపాయల వరకు లాభం మిగిలేది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల అన్ని ఖర్చులు పోను 5 నుండి 6 రూపాయలు మాత్రమే మిగులుతోందని వారు వాపోతున్నారు. షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు, పనివారి జీతాలు, మున్సిపాలిటీ నీటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. లాభాలన్నీ పెద్ద పౌల్ట్రీ కంపెనీలకే వెళ్తున్నాయని, రిటైల్ వ్యాపారులను ఆదుకోవడానికి మార్జిన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

సాధారణంగా ఒక కిలో బతికున్న కోడి ధర 120 రూపాయలు అనుకుంటే.. దానిని కట్ చేసిన తర్వాత వచ్చే మాంసం సుమారు 750 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనివల్ల కిలో చికెన్ ధర అప్పటికప్పుడే 160 రూపాయలకు చేరుతుంది. దీనిని కస్టమర్‌కు 200 రూపాయలకు అమ్మినప్పుడు 40 రూపాయల లాభం కనిపిస్తుంది. కానీ, ఇందులో.. షాపు రెంట్, కరెంట్ బిల్లు, కూలీల జీతాలు, వేస్టేజ్, అమ్ముడుపోని స్టాక్.. వంటివి తీసేస్తే తమకు మిగిలేది చాలా తక్కువ అని షాపు ఓనర్లు చెబుతున్నారు. మరోవైపు పౌల్ట్రీ కంపెనీలు తమ ఫీడ్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగాయని చెబుతున్నాయి. గతంలో కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయలుగా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం 8 నుంచి 10 రూపాయలకి తగ్గించటంతో తీవ్రంగా నష్టపోతున్నామని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ధరను భట్టే తాము హోటళ్లకు, బల్క్‌గా చికెన్ తీసుకునేవారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుపుతున్నారు. సడెన్‌గా ధరలు తగ్గిస్తే తమకు నష్టం ఉంటుందని చెప్పారు. గతంలో ఇచ్చిన విధంగా పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు.

తమ న్యాయమైన డిమాండ్లను పౌల్ట్రీ కంపెనీలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, చికెన్ దుకాణాలు మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్వహరిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. చికెన్ దుకాణాల బంద్‌కు వినియోగదారులు కూడా సహకరించాలని కోరుతున్నారు. హైదరాబాద్ సిటీలోనే 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 వేల రిటైల్ చికెన్ సెంటర్లున్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్​పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. అలాంటి చికెన్ షాపులు మూతపడితే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది.

Exit mobile version