Telangana Teachers: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త తెలిపింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించిన ప్రకారం, ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీజీటెట్ నోటిఫికేషన్ జూలై 21న విడుదల కానుంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సీబీటీ విధానంలో నిర్వహించబడతాయి. ఇకపై ప్రతి సంవత్సరం రెండు టెట్లు ఇన్సర్వీస్ టీచర్లకు, మరో రెండు సాధారణ అభ్యర్థులకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తంగా ఒకే ఏడాదిలో నాలుగు టెట్లు నిర్వహించనున్నారు..
టీజీటెట్-జూన్ 2026 ఫలితాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్.. ఫలితాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 1,53,752 మంది దరఖాస్తు చేసుకోగా, 1,15,028 మంది హాజరయ్యారు. వీరిలో 50,544 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైందని తెలిపారు.. ఇక, పేపర్-1లో 65.29 శాతం, పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)లో 40.76 శాతం, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 25.79 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ నిర్ణయాలతో ఉపాధ్యాయులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

