Hyderabad Gas Shortage: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. దీంతో క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.. పెట్రో, గ్యాస్ కు కొరత ఏర్పడుతుంది.. అయితే, ముఖ్యంగా భారత్లో కమర్షియల్ గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది.. వంట గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. హోటళ్లకు మాత్రం సరఫరా తగ్గించింది.. అయితే, హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు, హాస్టళ్ల కిచెన్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఇప్పుడు కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో కట్టెలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది.
భారీగా పెరిగిన కట్టెల అమ్మకాలు
కట్టెల మండి నిర్వాహకుల ప్రకారం, మొన్నటి వరకు రోజుకు సుమారు 5 నుంచి 10 క్వింటాళ్ల (500 కిలో నుంచి వెయ్యి కిలోలు) వరకు మాత్రమే కట్టెలు అమ్ముడయ్యేవి. అయితే, గత రెండు మూడు రోజులుగా డిమాండ్ అమాంతం పెరిగి రోజుకు సుమారు ఐదు టన్నుల వరకు (5 వేల కిలోలు) కట్టెలు అమ్ముడవుతున్నాయని కట్టెల మండి నిర్వాహకులు చెబుతున్నారు.. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో కట్టెల నిల్వలు కూడా పూర్తిగా అయిపోయే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గత నాలుగు రోజులుగా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కట్టెలతో వంట చేయడం వల్ల అన్ని రకాల వంటకాలు తయారు చేయడం కష్టంగా మారిందని, దీంతో వ్యాపారం కూడా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
