Beer Sales New Record: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకే నడి నెత్తిన సూర్యారావ్ మంటెక్కించేస్తున్నాడు. ఎక్కడ చూసినా నలభై మూడు డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ప్రతిసారి ఏప్రిల్, మే నెలల్లో ఎండల భగ్గుమంటే, ఈసారి మార్చి నుంచే భానుడు నిప్పులు కురిపించడం మొదలెట్టాడు. జనాలు చల్లటి పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. మందుబాబులు మాత్రం కూల్గా బీర్లు తాగేస్తున్నారు. మలమలమాడే ఎండకు చిల్డ్ బేరేసి చిల్లవుతున్నారు. దాంతో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేసులకు కేసులు రాగించేస్తుండటంతో… కోట్ల లీటర్ల బీరు మార్కెట్లోకి ఏరులై పారుతోంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు వేలాది కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయి. వాతావరణానికి తోడు ఐపీఎల్ కూడా తోడుకావడంతో మ్యాచ్ చూస్తూ పీపాలకు పీపాలు లేపేస్తున్నారు. మద్యానికి బదులు బీర్లు తాగేవారు ఎక్కువయ్యారు. బీర్ డిమాండ్ వీకెండ్స్ కు రెట్టింపైంది. మున్ముందు బీర్ సేల్స్ రికార్డు స్థాయికి చేరుతాయంటున్నారు. బీర్ల సేల్స్ పెరిగేకొద్దీ అబ్కారీ శాఖ ఖజానా కళకళలాడుతోంది.
దేశవ్యాప్తంగా 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందునా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ మార్చిలో ఏకంగా 50 లక్షల కేసులకి పైగా బీర్ అమ్ముడైంది. ఇది గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే 22 శాతం ఎక్కువ.
ఏప్రిల్ మొదటి 13 రోజుల్లోనే దాదాపు 21 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 1.7 లక్షల నుంచి 1.8 లక్షల కేసుల సేల్స్ జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 1.50 లక్షల కేసులు అమ్ముడైతే, ఇప్పుడు అది 2 లక్షలకు చేరింది. ఎండలు పెరిగే కొద్దీ ఇది 2.5 లక్షలకు చేరవచ్చని అంచనా.
…
హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రీమియం,ఫారిన్ బ్రాండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సాధారణంగా ఏడాదికి 450-500 లక్షల కేసులు అమ్ముడవుతుంటాయి, కానీ ఈ ఏడాది అది 600 లక్షల కేసులను దాటుతుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో కూడా బీర్ అమ్మకాలు సుమారు 15శాతం నుండి 20శాతం వరకు వృద్ధిని కనబరుస్తున్నాయి. యువతలో క్రాఫ్ట్ బీర్లు, తక్కువ ఆల్కహాల్ ఉండే బీర్ల పట్ల ఆసక్తి పెరగడం కూడా ఈ వృద్ధికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తికి అవసరమైన నీటి కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్ల సరఫరాపై కొంత ఒత్తిడి కూడా ఉంది. బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు బీర్ స్టాక్ను సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాట్లో వుండడంతో ఈ సమ్మర్ హీట్ చిల్ అవుతుందంటున్నారు వ్యాపారులు. స్టాక్ త్వరగా ఖాళీ అవుతుండటంతో డీలర్లు అడిషనల్ కార్టన్ల కోసం డిపోల చుట్టూ తిరుగుతున్నారు. మామూలుగా వారానికి ఒక్కసారి స్టాక్ తెప్పించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు నాలుగు రోజులకు ఒకసారి తెప్పించాల్సిన పరిస్థితి. ఆ స్థాయిలో సేల్స్ పెరిగాయి. ఈవెంట్లు, పార్టీలకు వేసవి కాలం అనుకూలంగా మారడంతో వీకెండ్స్లో బీర్ డిమాండ్ మరింత పెరుగుతోందని ట్రేడర్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత నెల నుంచే బీరు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30 శాతం మేరకు పెరిగాయి. వచ్చే రెండు మాసాల్లో ఎండలు మరింత పెరగనుండటతో సేల్స్ కూడా భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి ఎక్సైజ్ వర్గాలు. ఏపీలో మార్చి నెలలో 29.8 శాతం మేరకు అధికంగా బీర్లు అమ్ముడైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వినియోగదారులు లిక్కర్ కంటే బీర్లకే మొగ్గుచూపుతున్నారు మందుబాబులు. గతేడాది ఏప్రిల్లో 12 వరకు 11.78 లక్షల కేసుల మద్యం అమ్మగా, ఈ ఏడాది ఏప్రిల్లో ఇప్పటి వరకు 8.52 లక్షల కేసుల మద్యమే అమ్ముడైంది. మార్చిలో సుమారు 26.11 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది మార్చిలో కేవలం 20 లక్షల కేసులు మాత్రమే. అంటే దాదాపు 30% వృద్ధి నమోదైంది. ఏప్రిల్ మొదటి 12 రోజుల్లోనే 9.2 లక్షల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 8.16 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో బీర్ల వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది వృద్ధి రేటు ఏపీలోనే ఎక్కువగా వుంది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ప్రజలు లిక్కర్ నుంచి బీర్లకు షిఫ్ట్ అవ్వడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా 28.4 శాతం వృద్ధి సాధించింది. శ్రీసత్యసాయిలో 27.75 శాతం, కర్నూలులో 26.03 శాతం అమ్మకాలు పెరిగాయి.
మద్యం ఆదాయం కూడా భారీగా పెరిగింది. అందులో బీర్ల వాటా గణనీయం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం మద్యం ద్వారా సుమారు 29,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కేవలం మద్యం విక్రయాల ద్వారానే ప్రభుత్వానికి దాదాపు 4,500-5,000 కోట్ల మధ్య ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వాలకు ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చే ఆదాయం ఈ రెండు నెలల్లో గతేడాది కంటే 15-20శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటే, కేవలం ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా 800 నుంచి 900 మిలియన్ లీటర్ల బీర్ వినియోగం జరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలు బీర్ కంపెనీలకు, ప్రభుత్వ ఖజానాకు గోల్డెన్ పీరియడ్ గా మారాయి. తెలంగాణలో 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో మద్యం, బీర్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానా కళకళలాడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 40,209 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఈ వేసవి కాలం సింహభాగం. మార్చి నెలలో మద్యం, బీర్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు 3,486 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఏప్రిల్, మే నెలల్లో కలిపి కేవలం బీర్ల ద్వారానే ప్రభుత్వానికి 2,500 కోట్ల పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీర్ల వినియోగం పెరగడం ఒక ఎత్తైతే, స్టాక్ అందుబాటులో ఉంచడం ఎక్సైజ్ శాఖకు సవాలుగా మారింది. దీంతో భగభగమండే ఎండలకు పోటీలకు బీర్ల ధరలు కూడా పెరగనున్నాయి. రానున్న రోజుల్లో బీర్ల ధరలు పెంచాల్సిందేనని కంపెనీలు పట్టుబడుతున్నాయి.
మాడు పగిలే ఎండల్లో చల్లగా బీరు తాగి చిల్లవుతున్నోళ్ల జేబుకు త్వరలో చిల్లు పడబోతోంది. మద్యం, బీర్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పటికే ధరల పెంపుదలపై మద్యం కంపెనీలు ఒత్తిడి చేయడమే కాక.. సరఫరా కూడా నిలిపివేసాయి. దీంతో త్వరలోనే తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి. అలాగే పాత ధరలకు విక్రయాలు నిలిపి వేయడమేకాక.. కొత్త ధరల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా భారం, ఇరాన్-అమెరికా యుద్ధ పరిణామాలతో తాము కుదేలవుతున్నామని, ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని మద్యం తయారీ కంపెనీలు ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేశాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని, తమకు మిగిలే లాభం నామమాత్రమేనని అంటున్నాయి. ఒకవేళ సరఫరా నిలిపివేయాల్సి వస్తే.. తొలుత తెలంగాణకే నిలిపివేస్తామని తేల్చిచెప్పాయి. ఈ వారం లోగా పెంపుపై స్పష్టమైన హామీ రాకపోతే.. నేరుగా ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ అభిప్రాయం తెలిపాలని కంపెనీలు డిసైడయ్యాయి. ఈ పరిణామాలను చూస్తుంటే.. వచ్చే నెలలో మద్యం, బీర్ల ధరలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్ణీత గడువు ముగిసినందున మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. యుద్ధం, స్టాక్ కొరతను సాకుగా చూపుతూ పనిలో పనిగా బీర్ల ధరలు కూడా పెంచుకోవడానికి ఉత్పత్త్తిదారులు ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
కామన్గా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలను సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచినప్పటికీ.. సాధారణ మద్యం ధరల పెంపు మాత్రం పెండింగ్లో ఉంది. అంతకుముందు 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మే నాటికి మళ్లీ పెంచాల్సి ఉంది.కానీ స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పట్లో జరిగిన జాప్యాన్ని కంపెనీలు ఇప్పుడు సాకుగా చూపుతున్నాయి. అంతేకాదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత వేసవిలో బీర్లకు డిమాండ్ ఉన్న క్రమంలో సప్లయ్ నిలిపివేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. దీని వెనుక మద్యం, బీర్ల ధరలను ఏకకాలంలో పెంచుకునే కుట్ర ఉందన్న టాక్ నడుస్తోంది. నిజానికి లిక్కర్ ధరలను పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీ.. ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో ధరల పెంపు ఏ మేరకు ఉందనే సమాచారాన్ని తెప్పించుకుని చర్చిస్తోంది. దాదాపు మే నెలలో మద్యం ధర పెంపు పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఇదే సమయంలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సహజ వాయువు సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం నింపే గ్లాస్ బాటిల్స్ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటున్నారు డిస్టిలరీల యజమానులు.ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని, వెంటనే మద్యం ధరలు పెంచాలని ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచినప్పటికీ.. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల రేట్లు పెరగడంతో మరోసారి ధరల పెంపు తప్పనిసరి అని వాదిస్తున్నాయి కంపెనీలు. వేసవిలో బీర్లకు డిమాండ్ 30శాతం వరకు పెరుగుతుండటంతో సరఫరా తగ్గడం మార్కెట్లో కొంతమేరకు కొరతకు దారితీస్తోంది. ఇదే అనువుగా భావించిన కంపెనీలు.. బీరు ధరల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చాయి. మద్యం కంపెనీలు బలవంతంగా బీర్ల ధరలు పెంచుకోవడానికే సరఫరా నిలిపివేస్తామంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి 2027 ఫిబ్రవరిలో ధరలు పెంచాల్సి ఉంది. కానీ, తొమ్మిది నెలల ముందే బీర్ల ధరను పెంచుకోవడానికి తయారీ కంపెనీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. సమ్మర్లో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా వేసవిలో అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని బీర్ల ధరలను కూడా భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం రకం బీర్ల ధరలు ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న దాని కంటే కనీసం 10-15 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్లో బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. వేసవి కాలం కావడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది, దీనిని ఆసరాగా చేసుకుని కంపెనీలు ధరలు పెంచాలని భావిస్తున్నాయి. ప్యాకేజింగ్ మెటీరియల్స్, గాజు సీసాల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల బీర్ల ఉత్పత్తి వ్యయం 12-15% పెరిగింది. రికార్డ్స్థాయిలో బీర్ల అమ్మకాలు ఉండటంతో, ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడటంతో గాజు సీసాల ధరలు 20% పెరిగాయి. పేపర్ కార్టన్ల రేట్లు రెట్టింపు అయ్యాయి. లేబుల్స్, టేపుల ధరలు కూడా పెరిగాయని ‘బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారుగా ఉన్న భారత్, మధ్యప్రాచ్యంపైనే ఎక్కువగా ఆధారపడింది. ముఖ్యంగా ఖతార్ నుంచి తన మొత్తం గ్యాస్ సరఫరాలో 40% దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ దాడితో ఖతార్ ఎగుమతులపై ప్రభావం పడి, భారత కంపెనీలకు గ్యాస్ లభ్యత కష్టమైంది. గాజు తయారీ పరిశ్రమలో కొలిములకు గ్యాస్ చాలా అవసరం. దీని కొరతతో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వంటి గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 40% తగ్గింది. భారత్లో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉండే ‘పీక్ సమ్మర్’ సీజన్లోనే ఈ సంక్షోభం తలెత్తింది. అల్యూమినియం క్యాన్ల సరఫరాదారులు కూడా సప్లై తగ్గిస్తామని హెచ్చరించడంతో, మార్కెట్పై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో కార్యకలాపాలు కష్టంగా మారుతున్నాయని అసోసియేషన్ చెబుతోంది.మొత్తగా మేలో బీర్ల లవర్లకు రేట్ల షాక్ తప్పేలా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో బీరు ఏరులై పారుతోంది. ఎండలు పెరగడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటనేది టెన్షన్ పెడుతోంది.బీర్లు దొరుకుతాయా లేదా అనేది ఆందోళన కలిగిస్తోంది. డిమాండ్ కు తగ్గ సప్లయ్ ఉంటుందా?ఉత్పత్తి పెంచుతున్నారా?వేసవి అంతా షార్టేజ్ లేకుండా చూస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మార్చ్లో తెలంగాణలో బీర్ విక్రయాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ డేటా ప్రకారం, మార్చి 2025లో 30 లక్షల కేసులు అమ్ముడవగా… మార్చి 2026లో అది 50.78 లక్షల కేసులకు పెరిగింది. ఇది 22 శాతం వృద్ధి రికార్డైంది. ఈ పెరుగుదల ఈ ఏడాది ప్రారంభం నుంచే కనిపించింది. జనవరి 2025లో 31 లక్షల కేసులు అమ్ముడవగా, జనవరి 2026లో 34 లక్షల కేసులకు పెరిగింది. ఫిబ్రవరిలో 28 లక్షల నుంచి 38 లక్షల కేసులకు భారీగా పెరిగింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో డిమాండ్ మరింత ఎక్కువైంది. ఏప్రిల్ నెలలో తొలి 13 రోజుల్లోనే 21 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం రోజుకు సగటున 1.7 నుంచి 1.8 లక్షల కేసులు సేల్ అవుతున్నాయి.
మే నెలలో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.కానీ మంజీరా నదిలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. నీటి కొరత పెరిగితే ఉత్పత్తి తగ్గి సరఫరాలో అంతరాయం కలగొచ్చని అధికారులు హెచ్చరించారు. డిమాండ్కు సరిపడా సరఫరా చేయడం కష్టమవుతుందని సూచించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డిపో నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా పెంచినట్లు, గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తిని 10 నుంచి 12 శాతం పెంచినట్లు తెలిపారు. గోదాముల్లో నిల్వలను కూడా 15 రోజుల నుంచి 35 రోజులకు పెంచారు. డిమాండ్ ఇదే రీతిలో కొనసాగితే సరఫరా సవాల్గా మారే ఛాన్స్ వుంది. సాధారణంగా 450 నుంచి 500 లక్షల కేసుల మధ్య ఉండే వార్షిక అమ్మకాలు ఈ ఏడాది 600 లక్షల కేసులను దాటే అవకాశముందని అంచనా.
ఏపీలోనూ బీర్ అమ్మకాలు జోరుయందుకున్నాయి..ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు… కోస్తా నుంచి నగర ప్రాంతాల వరకు… ఏపీ అంతటా బీర్ సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ దాటడంతో చల్లదనానికోసం బీర్ వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన తర్వాత వీకెండ్స్లో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, స్క్రీనింగ్ పార్టీలు, ఫ్యామిలీ ఈవెంట్స్ ఇలా ప్రతి వేడుకలో బీర్ వినియోగం పెరిగిందని లిక్కర్ షాపుల యజమానులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోజువారీ అమ్మకాలు సాధారణ రోజుల కంటే రెట్టింపు అయ్యాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు హార్డ్ లిక్కర్కు బదులుగా బీర్ వైపు మొగ్గుచూపడంతో… బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం… మార్చి నెలలోనే బీర్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 29.8 శాతం పెరిగాయి.2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీర్ అమ్ముడైతే… ఈ ఏడాది మార్చిలో అదే సంఖ్య 26.11 లక్షల కేసులకు చేరింది. అంటే ఒక్క నెలలోనే లక్షల కేసుల అదనపు విక్రయాలు నమోదయ్యాయి.మార్చి నెలాఖరు వరకు మొత్తం విక్రయాలను పరిశీలిస్తే… గత ఏడాదితో పోలిస్తే 12.72 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది ఏప్రిల్లో 8.16 లక్షల కేసులు అమ్ముడైతే… ఈ ఏడాది అదే సమయానికి 9.2 లక్షల కేసుల బీర్ విక్రయమైంది.
బీర్ సేల్స్ పెరగడంతో లిక్కర్ వినియోగం మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది ఏప్రిల్లో 11.78 లక్షల కేసుల మద్యం అమ్ముడైతే… ఈ ఏడాది ఏప్రిల్లో అది కేవలం 8.52 లక్షల కేసులకు పడిపోయింది. అంటే లిక్కర్ అమ్మకాలు 27.64 శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి బీర్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ట్రెండ్ ముందుగానే మారింది. మార్చి నుంచే బీర్ మార్కెట్ పీక్లోకి వెళ్లింది.ఇప్పటివరకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో వినియోగదారులు ఎక్కువగా హార్డ్ లిక్కర్కే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఎండలు పెరిగిన వెంటనే బీర్ కొనుగోలు చేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటేశాయి. ఏప్రిల్ చివరి వారంలో, మే నెలలో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.ఇప్పుడే బీర్ అమ్మకాలు టాప్ గేర్లో ఉంటే… వచ్చే వారాల్లో మరింత పీక్కు చేరే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గట్లు సప్లయ్ ఉంటుందా అనేది టెన్షన్ పడుతోంది.కానీ ప్రస్తుతమైతే డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి జోరు పెరిగింది.మేలోనూ ఎలాంటి షార్టేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.మొత్తంగా ఎండలతో పోటీ పడి బీర్ సేల్స్ పెరుగుతున్నాయి.టెంపరేచర్స్ పెరిగే కొద్దీ సేల్స్… రికార్డ్ స్థాయిలో వుంటున్నాయి.డిమాండ్ తగ్గట్టు సప్లయ్ ఉండేలా చూడాలని బీర్ లవర్స్ కోరుతున్నారు.కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలంటున్నారు.హాట్హాట్ సమ్మర్ లో చిల్ అయ్యేలా కోరిన బ్రాండ్ దొరికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
