హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎంఆర్ఎల్ (HMRL) ఛైర్మన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, , ఎల్ అండ్ టీ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా షేర్ల కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఎల్ అండ్ టీ తరఫున డి.కె.సేన్, కేవీబీ రెడ్డిలు సంతకాలు చేశారు.
ఈ భారీ ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ హామీతో ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల అప్పును ఏప్రిల్ 30, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. ఈ చారిత్రాత్మక లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా, షరాఫ్ & పార్ట్నర్స్ లీగల్ అడ్వైజరీ సేవలను అందించాయి. ఈ అధికారిక ఒప్పందానికి ముందు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చలు జరపడం గమనార్హం.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I కింద ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కొనసాగుతోంది. 2017 నవంబర్లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలు నమోదు కాగా, ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 4.50 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి రావడంతో, ప్రస్తుతం ఉన్న ఫేజ్-I , ప్రతిపాదిత ఫేజ్-II నెట్వర్క్ పనులు, ప్రణాళికలు, , విస్తరణలో మరింత మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో నగరవాసులకు మరింత సమగ్రమైన, నమ్మదగిన , ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
