భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఆషాఢ బోనాలు ముహూర్థం ఖరారైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి.
జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు నిర్వహించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించామని ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల పండుగ గొప్పగా చేయాలని , కల్చరల్, లైటింగ్, ఎల్సీడీ స్క్రీన్లతో ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య బోనాల జాతర జరుగుతుందని పేర్కొన్నారు.
కాగా.. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లష్కర్ బోనాలకు చారిత్రక నేపథ్యం ఉంది. కలరా , ప్లేగు వంటి వ్యాధులతో ప్రజలు మృతి చెందుతుండటంతో మహంకాళి అమ్మవారిని తమ గ్రామ దేవతగా ప్రజలు కొలవటం ప్రారంభించారు. నగరంలో గోల్కొండ బోనాల తరువాత అంతే స్థాయిలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది.
బ్రిటిష్ కాలంలో కాంట్రాక్టర్గా ఉన్న నగరవాసి ఉజ్జాయినిలో పనులు నిర్వహించేవాడు ఈ క్రమంలో తమ ప్రాంతంలో కలర, మసూచి, ప్లేగు వంటి రోగాలు వచ్చి ప్రజలు చనిపోతూ ఉంటే తమ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడితే తమ గ్రామ దేవతగా కొలుస్తామని మొక్కుకున్నాడట. ఉజ్జయినిలో అమ్మవారికి మొక్కుకున్నాడు కాబట్టి ఆదే పేరుతో ఉజ్జయిని మహంకాళీగా పూజలు చేయడం మొదలు పెట్టారు.
అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి ఆమడ దూరంలో లష్కర్ ఓ చిన్న గ్రామంగా ఉండేది. కాలక్రమంలో హైదరాబాద్, లష్కర్లు కలిసిపోయాయి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తులు బోనాలు సమర్పిస్తుంటారు. బెజవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి ఎంత విశిష్టత ఉందే అంతే మహిమలు, శక్తి ఉజ్జాయిని మహంకాళికి ఉన్నాయని భక్తులు నమ్ముతారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది భక్తులు మహంకాళి అమ్మవారి దర్శనార్థం తరలివస్తుంటారు. రెండు సంవత్సరాల తర్వాత బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారితో 2020-2021 సంతవత్సారాలు అంతగా జరిపించకపోయినా ఇప్పుడు బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పనులను ప్రారంభించింది. బోనాలతో భాగ్యనగరానికి కొత్తకళ రానుంది.
Sunitha Lakshma Reddy: సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి.. డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశం