జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి కొనసాగుతుంది. ప్రాణహిత పుష్కరాల 6వ రోజు సందర్భంగా కాళేశ్వరానికి భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని త్రివేణి సంగమ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. దీపాలు వదులుతున్నారు.
తీరంలో పురోహితులతో పిండ, శ్రాద్ధ కర్మ పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పొరుగున ఉన్న మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలుక కేంద్రంలో ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. ప్రాణహిత నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా తరలివస్తున్నా భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం సుందరంగా ఏర్పాట్లు చేశారు.