షార్ట్ సర్క్యూట్ కారణంగా గాంధీ ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆస్ప్రతి సిబ్బంది, రోగులు బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్ రెడ్డి ఆస్ప్రతిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది 15 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆస్పత్రిసిబ్బంది, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
ఆస్పత్రిలో ఉపయోగించే పరికరాలు పాడవ్వలేదన్నారు రమేష్ రెడ్డి . 120 మంది పేషంట్లను పక్క వార్డులోకి తరలించామని.. రెండు రోజుల్లో అంతా క్లియర్ చేస్తామని వెల్లడించారు. ఎలక్ట్రికల్ సిబ్బందికి పక్క వార్డుల్లో ఉన్న బోర్డులను చెక్ చేయమని ఆదేశించిన ఆయన.. అన్ని ఆస్ప్రత్రుల్లో ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే ఫైర్ స్టేషన్ ఉందని.. మొదట్లో డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహించామని, మళ్లీ ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తామని.. అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు డీఎంఈ రమేష్ రెడ్డి.