తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మార్చి తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి ప్రకటించారు. దాని కోసం సాధ్యాసాధ్యాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలిపారు.
అటు దళిత బంధు పథకానికి రూ.20వేల కోట్లు పెట్టి ప్రతి దళిత బిడ్డను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఎర్రబెల్లి వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. అర్హులకు ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలలో రూ. 10 లక్షలు జమా అవుతాయన్నారు. దళిత బంధు పథకం అమలు ప్రక్రియ వేగంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. కేసీఆర్ తెలంగాణ గాంధీ అని ఎర్రబెల్లి కొనియాడారు.
