దేశం గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది: డీకే అరుణ

హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ బీపిన్‌ రావత్‌కు రాష్ర్ట బీజేపీ నేతలు బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వివేక్‌, ఇంద్రాసేనారెడ్డి, డీకే అరుణ ఉన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. బిపిన్‌ రావత్‌ గొప్ప దేశభక్తుడని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. దేశం ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని ఆమె తెలిపారు.

టెర్రరిస్టులను ఎదుర్కొవడంలో ఆయన అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులకు సైతం అందవని కొనియాడారు. దేశానికి ఆయన మరణం తీరని లోటని ఆమె అన్నారు. ఎన్నో యుద్ధాల్లో సారథిగా భారత్‌కు అండగా నిలిచారన్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా మరణించడం బాధ కలిగిస్తుందన్నారు. ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సర్జికల్‌ స్ర్టైక్స్‌ను విజయవంతం చేసి ప్రపంచానికి భారత్‌ అంటే ఏంటో చూపించారన్నారు. కాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఎటాక్‌ జరిగినప్పుడు ఆయన అనుసరించిన వ్యూహాలతో భారత్‌ సైన్యం ఎన్నో గొప్ప విజయాలను సాధించిందన్నారు.