DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!

  • దోస్త్‌లో సగానికి పైగా సీట్లు ఖాళీ
  • ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ల సంక్షోభం
  • ప్రభుత్వ అటానమస్ కాలేజీలకు భారీ ఆదరణ
  • కామర్స్, సైన్స్ కోర్సులకే విద్యార్థుల మొగ్గు
Dost

Dost

DOST : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఈ సారి భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దోస్త్ (DOST) ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా వెల్లడైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో కనీసం 43 శాతం కూడా భర్తీ కాలేని అచేతన స్థితి నెలకొంది. విద్యార్థులు ఎక్కువగా నాణ్యమైన విద్యా ప్రమాణాలు, మెరుగైన గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ ఏడాది అడ్మిషన్ల సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

దోస్త్ పరిధిలో సగానికి పైగా ఖాళీలు

రాష్ట్రంలో దోస్త్ పరిధిలోకి వచ్చే మొత్తం 780 డిగ్రీ కాలేజీలలో కలిపి 3,70,509 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత అడ్మిషన్ల రౌండ్ల ముగింపు నాటికి కేవలం 1,56,531 సీట్లు మాత్రమే కేటాయింపు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే సగానికి పైగా డిగ్రీ సీట్లకు విద్యార్థులు కరువయ్యారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోని 580 ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 2,47,040 సీట్ల సామర్థ్యం (ఇన్‌టేక్) ఉండగా, కేవలం 70,471 మంది విద్యార్థులు మాత్రమే ఆయా కాలేజీల్లో చేరారు. అంటే ప్రైవేట్ రంగంలో కేవలం 28.5 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అత్యధిక సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అడ్మిషన్లు ఇంత దారుణంగా పడిపోవడం ప్రైవేట్ యాజమాన్యాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

ప్రభుత్వ అటానమస్ కాలేజీలకు పెరిగిన క్రేజ్

ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వ అటానమస్ (Government Autonomous) కాలేజీలకు మాత్రం విద్యార్థుల నుండి భారీ డిమాండ్ వ్యక్తమైంది. ఈ కాలేజీల్లో మొత్తం 45,060 సీట్లు అందుబాటులో ఉండగా.. ఏకంగా 39,098 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంటే ఇక్కడ సుమారు 87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థులు ఫీజులు, మౌలిక వసతులు , విద్యా ప్రమాణాల పరంగా ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలకే జై కొడుతున్నారని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

కామర్స్, సైన్స్ కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు

ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో విద్యార్థులు ఎక్కువగా కామర్స్, సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపారు. మొత్తం అడ్మిషన్లలో బి.కామ్ (B.Com) కోర్సు 52,167 అడ్మిషన్లతో మొదటి స్థానంలో నిలిచి తన డిమాండ్‌ను నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బి.ఎస్సీ ఫిజికల్ సైన్స్ (B.Sc Physical Science) కోర్సును 34,194 మంది విద్యార్థులు, బి.ఎస్సీ లైఫ్ సైన్స్ (B.Sc Life Science) కోర్సును 28,000 మంది విద్యార్థులు ఎంచుకున్నారు. ఇక హ్యుమానిటీస్ విభాగంలో బి.ఎ (B.A) కోర్సులో 22,704 అడ్మిషన్లు నమోదయ్యాయి. దీనిని బట్టి సాంప్రదాయ కోర్సుల్లో కూడా నిర్దేశిత విభాగాలకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.