CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు

  • సీఎంసీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన
  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్
  • గ్రేడ్ సెపరేటర్లు, ఆర్వోబీలకు గ్రీన్ సిగ్నల్
  • బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రజలకు అంకితం
Revanth

Revanth

CM Revanth Reddy : హైదరాబాద్ ఐటీ కారిడార్ , దాని పరిసర ప్రాంతాల రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం మరో భారీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో రూ.1,858 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం శంకుస్థాపనలు చేయనున్నారు.

రేపు సాయంత్రం 6 గంటలకు ఖానామెట్‌ లోని ముండికుంట చెరువు సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి, అక్కడ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 161 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ పరిపాలనా భవనం పర్యావరణహితంగా, అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకోనుంది. 4 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల చదరపు అడుగులకు పైగా బిల్ట్-అప్ ఏరియాతో ‘నెట్ జీరో ఎనర్జీ గ్రీన్ డింగ్’ నమూనాలో దీనిని నిర్మించబోతున్నారు. ప్రాథమికంగా ఈ భవనాన్ని జీ+8 అంతస్తులతో నిర్మిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలు , విస్తరణను దృష్టిలో ఉంచుకుని జీ+12 అంతస్తుల వరకు పెంచుకునేలా దీనికి పునాది వేస్తున్నారు. ఈ భవనం రాబోయే రోజుల్లో సైబరాబాద్ ప్రాంతానికే ఒక ప్రధాన ల్యాండ్‌మార్క్ అడ్మినిస్ట్రేటివ్ హబ్‌గా నిలవనుంది.

×
×
Ad

దీనితో పాటు సైబరాబాద్ , ఐటీ కారిడార్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు భారీ రోడ్డు ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఇక్కడి ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ.459 కోట్ల ప్రతిపాదనలతో గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. అలాగే అత్యంత రద్దీగా ఉండే ఆల్విన్ ఎక్స్ రోడ్స్ – మియాపూర్ జంక్షన్ మార్గంలో రూ.530 కోట్ల భారీ వ్యయంతో గ్రేడ్ సెపరేటర్లను నిర్మించనున్నారు. వీటితో పాటు లింగంపల్లి ఆర్‌వోబీ (ROB) నిర్మాణ పనులను రూ.308 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోతుండగా, ఖాజాగూడ జంక్షన్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ.220 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. కూకట్‌పల్లి వై జంక్షన్ , ఐడీఎల్ లేక్ జంక్షన్ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతుల పనుల కోసం రూ.180 కోట్లు కేటాయించారు.

ఈ శంకుస్థాపనల కార్యక్రమాలతో పాటు, ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేలా ఒక కీలక ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి అందుబాటులోకి తేనున్నారు. బాచుపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సరికొత్త ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. దీనివల్ల నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తప్పనున్నాయి.