సోషల్ మీడియాలో ఒక ప్రజా ప్రతినిధి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను 2018 బ్యాచ్ కు చెందిన ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం సైబరాబాద్ CAR నుంచి ఆర్డర్ టు సర్వ్ లో భాగం గా హైదరాబాద్ CAR హెడ్క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న కె. అనిల్ సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాల్సి ఉంటుందని సీపీ డా. ఎం. రమేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో కూడా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను కె. అనిల్పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు.

