అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధుల్లో ఉండి, బాధ్యతలను విస్మరించి వినోదం కోసం చేపలు పట్టిన సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బందిపై వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన సంచలన కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. క్రమశిక్షణ తప్పిన 60 మంది సిబ్బందిని ఒక్కసారిగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల ప్రకారం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర చేపల వేటపై కఠినమైన నిషేధం ఉంది. అయితే, దేశ రక్షణ బాధ్యతల్లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సిఆర్పిఎఫ్ జవాన్, యూనిఫాంలోనే ఉండి కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న క్రస్ట్ గేట్ల వద్ద గాలం వేసి చేపలు పట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, ఎన్టీవీ ఈ భద్రతా లోపాన్ని ఎండగడుతూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
ఎన్టీవీ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మొత్తం 60 మంది జవాన్లను నాగార్జున సాగర్ నుంచి విశాఖపట్నం బెటాలియన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్తగా మరో 60 మంది జవాన్లను డ్యామ్ భద్రత కోసం నియమించారు. కేవలం ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మొత్తం బృందంపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ఉద్రిక్తతలు , ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సాగర్ డ్యామ్ భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్గా ఉండాల్సిన చోట, ఇలా అత్యంత క్యాజువల్గా విధులను వదిలేసి చేపలు పట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్టీవీ కథనం ప్రభావంతో అధికారులు మేల్కొని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఈ బదిలీల ద్వారా గట్టి సందేశాన్ని పంపారు.
