సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళణ చెందుతున్నారు. ఈ నాలుగు కేసులలో ఒకరి రికవరి అయినట్టు జిల్లా వైద్యాధికారలు తెలిపారు. దీంతో ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్గా ఉంది. దీంతో కరోనా సోకిన వారి కాంటాక్ట్ హిస్టరీని అధికారులు పరిశీలిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్తో ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నా.. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,322 కొవిడ్ టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్గా బయటపడ్డాయి. మరో 38 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్డీ, గాంధీ ఆస్పత్రికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.