NTV Telugu Site icon

మరియమ్మ లాకప్‌డెత్.. డీజీపీ, సీఎస్‌కి కేసీఆర్‌ కీలక ఆదేశాలు

KCR

KCR

మరియమ్మ లాకప్‌డెత్ కేసు సంచనలం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌.. అయినా.. విమర్శలు తగ్గడంలేదు.. దానికి తోడు ఇవాళ కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఇక, మరియమ్మ లాకప్‌డెత్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం కేసీఆర్.. లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు సీఎం… ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించిన కేసీఆర్.. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేష్‌ కుమార్‌ను ఆదేశించారు. చింతకానికి వెల్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

also read హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!

ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.. మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రేస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సిఎం సూచించారు. దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో, ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమించం. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలని డీజీపీని ఆదేశించారు.