Fake Passport Scam: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్పోర్టు స్కాం కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ఇతర దేశాలకు చెందిన వారికి పాస్పోర్టులు జారీ చేసిన కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురంకు చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్పోర్టులతో పాటు పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరి నిలోఫర్ హాస్పిటల్ పేరుతో విదేశీయుల కోసం నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 92 మంది విదేశీయులు నకిలీ పత్రాలతో పాస్పోర్టులు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆ దేశాల్లో విదేశీయులు భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమా చిరునామాలతో కూడిన పాస్పోర్టులు ఎక్కువగా తీసుకున్నట్లు విచారణలో తేలింది.
Read also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?
ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసే పనిలో సీఐడీ నిమగ్నమైంది. ఒకే చిరునామాతో ఎక్కువ మంది పాస్పోర్టులు పొందినట్లు సీఐడీ వెల్లడించింది. ఇప్పటికే కొందరు నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారు దేశం దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో సీఐడీ అధికారులు 35కి పైగా పాస్పోర్టులను రద్దు చేయాలని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి సమాచారం అందించారు.
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలకపాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రక్రియ పూర్తి చేసి పాస్పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయ్ లాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లినట్లు వెల్లడైంది.
Suryapet Municipality: మున్సిపల్ ఆఫీసుల్లో అవిశ్వాస తీర్మానం… హాజరు కానీ కౌన్సిలర్లు..!
