సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన ‘డెడ్ డ్రాప్’ గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులకు ఇన్ఫోర్మర్లుగా నటిస్తూనే, మరోవైపు బొల్లా బ్రదర్స్ పెద్ద ఎత్తున గంజాయి దందా నడుపుతున్నట్లు తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ విచారణలో తేలింది. క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేసే వ్యాపారం ముసుగులో ఈ ముఠా నగరంలో గంజాయి నెట్వర్క్ను విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.
పోలీసులతో దోస్తీ.. దందాకు స్కెచ్
గతంలో పలు చోరీల కేసులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించి నిందితులను పట్టించడంలో బొల్లా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారు. ఇలా పోలీసుల నమ్మకాన్ని, సాన్నిహిత్యాన్ని పొందిన వీరు, ఆ దోస్తీనే అడ్డగా చేసుకుని గంజాయి వ్యాపారాన్ని నిర్భయంగా సాగించడానికి ప్లాన్ చేశారు. ఈగల్ ఫోర్స్ బృందం బొల్లా బ్రదర్స్ ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసిన సమయంలో, కొందరు స్థానిక కానిస్టేబుళ్లు వారితో కలిసి ఇంట్లోనే కల్లు పార్టీ చేసుకుంటూ ఉండడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే ఆ కానిస్టేబుళ్లను తీవ్రంగా మందలించిన ఈగల్ టీమ్ అక్కడి నుంచి పంపించివేసింది.
ఎస్సై వాకీ టాకీ దొరకడం కలకలం
ఈ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బొల్లా బ్రదర్స్తో తరచూ పార్టీలు చేసుకునే ఒక సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై), తన పోలీస్ మ్యాన్ ప్యాక్ (వాకీ టాకీ)ని వారి కారులోనే మరచిపోయి వెళ్లినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మ్యాన్ ప్యాక్ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు సదరు ఎస్సైని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కదలికలను ముందే తెలుసుకోవడానికే ఈ వాకీ టాకీని ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో రోజుకు 25 సార్లు సప్లై
ఒడిశా నుంచి నగరానికి గంజాయిని రవాణా చేయడానికి బొల్లా బ్రదర్స్ దాదాపు 30 మందికి పైగా వ్యక్తులను నియమించుకున్నట్లు ఈగల్ దర్యాప్తులో వెల్లడైంది. నంబర్ ప్లేట్లు లేని మూడు ద్విచక్ర వాహనాలను ఉపయోగించి, కొనుగోలుదారులతో నేరుగా సంబంధం లేకుండా ‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో రోజుకు దాదాపు 25 సార్లు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలల క్రితమే ఈగల్ టీమ్ బొల్లా బ్రదర్స్లో ఒకరిని అదుపులోకి తీసుకుని అతని ఫోన్ను సీజ్ చేసింది. అయితే, తమ దందాను కాపాడుకోవడానికి , పోలీసుల చర్యలను అడ్డుకోవడానికి బొల్లా బ్రదర్స్ కోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం వారి తెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.

