BJP Feeling Uncomfortable After KCR Announced BRS Party Says Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ చేసిన ‘బీఆర్ఎస్’ పార్టీ ప్రకటన బీజేపీను గడగడలాడించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి.. తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పనిచేయవని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని తమను ఏ శక్తి ఆపలేదని చెప్పారు.
అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ తన పేరుని జోడించిన విషయంపై కవిత స్పందించారు. ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరగాల్సి ఉంటే.. అక్కడికి మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికల ఉండటం వల్లే.. తెలంగాణలో ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. నీచమైన ఎత్తుగడుతో బీజేపీ తనతో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల మీద ఈడీ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ కేసులతో తాము భయపడేదే లేదని.. ఎటువంటి విచారణనైనా ఎదుర్కుంటామని అన్నారు. ఏజేన్సీలు ప్రశ్నిస్తే.. తాము తప్పకుండా సమాధానం చెప్తామన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతోందని, ఈ కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన ప్రభుత్వాల్ని కూల్చి, బీజేపీ అధికారంలోకి వచ్చిందని కవిత చెప్పారు. మోడీ తన పంథాను మార్చుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు వెళ్లి, ఎన్నికల్లో గెలవాలని హితవు పలికారు. అలా కాకుండా ఈడీలను, సీబీఐలను ప్రయోగించి గెలవలానుకుంటే.. తెలంగాణలో సాధ్యపడదని అన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నంతవరకు.. చిత్తశుద్ధితో పని చేస్తున్నంత కాలం.. తమకు ఎలాంటి ఇబ్బంది రాదని కవిత చెప్పారు.
