వచ్చే నెల తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎల్పీలో నేడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్ళందరూ రావాలని కోరుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి రండి.. వ్యవసాయంపై ఏం చేస్తుంది పార్టీ అనేది సభలో చెప్తామన్నారు.
మేము ఇచ్చిన సబ్సిడీలు అన్ని బంద్ అయ్యాయని, రుణమాఫీ భారం లక్ష పోయి..నాలుగు లక్షలు అయ్యిందని ఆయన ఆరోపించారు. మేము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందని, వ్యవసాయ రంగంపై ఏం చేస్తాం అనేది రాహుల్ గాంధీ సందేశం ఇస్తారన్నారు. జిగ్నేష్ పై తప్పుడు కేసులు పెట్టింది బీజేపీ అని, తప్పుడు కేసులతో వేధిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విధానంలో గొంతు నొక్కడమేంటని, బీజేపీ ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు.
