హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కారును దొంగిలించాలనే పక్కా ప్లాన్తో మహారాష్ట్రకు చెందిన ఓ గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు దుండగుల ముఠా ప్యాసింజర్ల రూపంలో రాజశేఖర్ క్యాబ్ను సంగారెడ్డి వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు. ప్రయాణం ప్రారంభమై పటాన్చెరు దాటిన తర్వాత దుండగులు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్తో “నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావ్, కావాలంటే మేము డ్రైవింగ్ చేస్తాం” అని నమ్మబలికారు.
అతనిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా డ్రైవింగ్ సీటు నుంచి పక్క సీటుకు మార్చారు. కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనుక సీట్లో ఉన్న ఒక దుండగుడు అకస్మాత్తుగా వైర్తో రాజశేఖర్ మెడకు ఉరి బిగించగా, పక్కనే ఉన్న మరో వ్యక్తి అతని ముఖంపై బలంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత, దుండగులు అతని మృతదేహాన్ని రుద్రారం వద్ద రోడ్డు పక్కన పారవేసి కారుతో పరారయ్యారు.
మొరాయించిన కారు.. ఫోన్ సిగ్నల్స్తో కేసు ఛేదన
హత్య అనంతరం కారుతో జహీరాబాద్ వైపు పారిపోతున్న గ్యాంగ్కు కోహీర్ వద్ద ఊహించని షాక్ తగిలింది. కారు సాంకేతిక సమస్యతో హఠాత్తుగా మొరాయించి ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో, చేసేదేమీ లేక దుండగులు తాళాలను కారుపైనే వదిలేసి అక్కడ నుంచి కాలినడకన పరారయ్యారు. ఆ తర్వాత జహీరాబాద్ చేరుకున్న దుండగులు రాజశేఖర్ వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్ను స్థానిక షాప్లో రూ.3,000లకు అమ్మి నగదు తీసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అయితే, రాజశేఖర్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదరు మొబైల్ షాప్ నిర్వాహకుడిని విచారించగా నలుగురు వ్యక్తులు వచ్చి ఫోన్ అమ్మినట్లు వెల్లడించాడు. దీంతో షాప్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, వారి కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు.

