Site icon NTV Telugu

Bandi Sanjay : తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలి

కృష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈరోజు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి పార్లమెంట్ హౌజ్ లోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసి కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని, తెలంగాణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Exit mobile version