తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూనే వున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరలేదన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల నివారణలో సీఎం వైఫల్యం చెందారన్నారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక అమలు చేయడంలేదని, తద్వారా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
లక్ష ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని 2014లో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పలేదా? అని నిలదీశారు. ఇన్నేళ్ళు అవుతున్నా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే వున్నారన్నారు. ఒక్క గ్రూప్-1 రిక్రూట్ మెంట్ లేదని, మూడేళ్లుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని బండి సంజయ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు విస్మరించడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే తామ భావిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం వుందన్నారు.
తెలంగాణలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెబుతోందని, నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ నేడు ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీ కోసం తదుపరి అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేపడతామని వెల్లడించారు.
