ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల సెల్ ఫోన్లు, బ్యాగ్ లు మిస్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.
లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్నగర్ నుండి టోలీచౌకి వైపు హోండా షైన్ బైక్పై వెళ్తుండగా, దారిలో రేతిబౌలి సమీపంలోకి రాగా వారి హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయిందని గుర్తించారు. బాధితురాలు తన బ్యాగ్ మిస్ అయిందని అందులో బంగారు ఆభరణాలను ఉన్నాయని ఫిర్యాదు చేసింది.ఆభరణాల జాడ కోసం సీసీ కెమెరాలను తనిఖీ చేశారు పోలీసులు.
ఆటోడ్రైవర్ లంగర్ హౌస్ పిల్లర్ నంబర్ 55 దగ్గర హ్యాండ్ బ్యాగ్ను గుర్తించి బ్యాగ్ను తెరిచి చూడగా ఒక్క బిల్లు రశీదుతోపాటు బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బాధితురాలి ఫోన్ నంబర్కు కాల్ చేసి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు బ్యాగ్ ను లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బ్యాగ్ను అప్పగించిన నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ను అభినందించారు బాధిత మహిళ, పోలీసులు.
