Shamirpet Celebrity Resort: హైదరాబాద్ శివార్లలోని సమీర్పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలతో పాటు భార్య.. భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఏం జరిగింది..
సిద్ధార్థ దాస్, స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 2019లో విభేదాల కారణంగా స్మిత తన భర్త నుంచి విడిపోయింది. అయితే స్మిత మాత్రం మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో నివసిస్తున్నారు. కానీ స్మిత పిల్లలను కూడా ఉంచుకుంది. పిల్లల సంరక్షణ కోసం సిద్ధార్థ దాస్ స్మిత విల్లాకు వచ్చాడు. అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ దాస్ పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే ఎయిర్ గన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. మనోజ్ పిల్లలను కొట్టాడని సిద్ధార్థ దాస్ ఆరోపిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని స్మిత చెబుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Raja Singh: రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
ఇదిలావుంటే, ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిదార్థ్-స్మితాల కొడుకు లేఖ రాశాడు. అందులో మనోజ్ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల శిశు సంక్షేమ కమిటీ సిద్ధార్థ్-స్మితల కుమారుడిని వారి సంరక్షణలో ఉంచింది. అయితే మనోజ్ తన సోదరిని కూడా కొడుతున్నాడని సిడబ్ల్యుసితో పాటు తన తండ్రి సిద్ధార్థ దాస్కు చెప్పాడు. ఈ క్రమంలో సిద్ధార్థ దాస్ విశాఖ నుంచి శామీర్ పేట చేరుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ వైజాగ్లో పనిచేస్తున్నాడు. అలాగే స్మిత, మనోజ్లు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారని సమాచారం. మనోజ్ కొన్ని సీరియల్స్లో కూడా నటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి స్టేట్మెంట్ను నమోదు చేయనున్నారు.
