Pawan Kumar Chandana: సాధారణంగా ఒక రాకెట్ సైంటిస్ట్ కథ అనగానే చిన్నప్పటి నుంచే చదువులో టాప్, మ్యాథ్స్లో వందకు వంద మార్కులు అనుకుంటాం. కానీ, పవన్ కుమార్ చందన కథ అలా మొదలుకాలేదు. గణితంలో కేవలం 51 మార్కులతో తడబడిన ఒక సాధారణ విద్యార్థి.. ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-1’ను అంతరిక్షంలోకి పంపి సరికొత్త రికార్డు సృష్టించాడు. భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఈ ఘనత వెనుక ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సంస్థ, దాని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన పట్టుదల ఉంది.
హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన పవన్కు చిన్నతనం నుంచే యంత్రాలు, సాంకేతికత ఎలా పనిచేస్తాయనే దానిపై అమితమైన ఆసక్తి ఉండేది. చదువులో మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో క్రమంగా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాడు. కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్పూర్ (IIT Kharagpur) లో సీటు సంపాదించాడు. ఐఐటీ పూర్తి కాగానే కార్పొరేట్ కంపెనీల్లో వచ్చే లక్షల ప్యాకేజీలను వదులుకుని, అంతరిక్షంపై ఉన్న ఇష్టంతో నేరుగా ‘ఇస్రో’ (ISRO) లో చేరాడు. ఇక, ఇస్రోలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఆరేళ్ల పాటు పనిచేసిన పవన్.. భారతదేశపు అత్యంత బరువైన రాకెట్ ‘GSLV Mk III’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి అంతర్గత ఇన్నోవేషన్ అవార్డును సైతం అందుకున్నాడు. అయితే, ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ రాకెట్లను తయారు చేయవచ్చనే ఆలోచన అతనిలో బలంగా నాటుకుంది. దాంతో, 2018 జూన్లో తన ఇస్రో సహచరుడు, ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన నాగ భరత్ డాకాతో కలిసి హైదరాబాద్లో ‘స్కైరూట్ ఏరోస్పేస్’ను ప్రారంభించాడు.
ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ పెట్టడం అంత ఈజీ కాదు. పెట్టుబడులు దొరకడం కష్టమైన తరుణంలో ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, పవన్ ఐఐటీ సీనియర్ అయిన బిన్నీ బన్సల్ $1.5 మిలియన్ల పెట్టుబడితో అండగా నిలిచారు. ఆ తర్వాత కోవిడ్ సంక్షోభం ఎదురైనప్పుడు గ్రీన్కో (Greenko) సంస్థ ఆర్థిక సహాయం అందించింది. దీంతో 2020 జూలైలో ‘రామన్-1’ అనే రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి, ఈ ఘనత సాధించిన దేశీయ మొదటి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ నిలిచింది. ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి తలుపులు బార్లా తెరిచాక, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేట్ కంపెనీగా రికార్డు సృష్టించి, ఏకంగా $51 మిలియన్ల భారీ నిధులను సమకూర్చుకుంది.
ధీరూభాయ్ అంబానీలా వ్యాపార మూల సూత్రాలను నమ్మే పవన్.. దేశ నిర్మాణానికి, ఉపాధి కల్పనకు ‘ఎంట్రప్రెన్యూర్షిప్’ (కార్యసాధకత) అత్యుత్తమ మార్గమని నమ్మాడు. ఆ నమ్మకమే 2022 నవంబర్ 18న ‘విక్రమ్-ఎస్’ అనే దేశపు మొదటి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్ ప్రయోగానికి దారితీసింది. ఆ తర్వాత ఇండో-ఫ్రెంచ్ సీఈఓ ఫోరమ్లో పవన్ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన రామ్ శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ షెర్పాల్లో వెంచర్స్ నేతృత్వంలో మరో $60 మిలియన్ల నిధులను రాబట్టింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రాన్ని స్కైరూట్ ప్రారంభించింది. ఇద్దరు మాజీ ఇస్రో ఇంజనీర్లతో మొదలైన ఈ ప్రయాణం.. నేడు వెయ్యి మంది ఉద్యోగులతో ప్రపంచ స్పేస్ మ్యాప్లోనే ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. నాడు మార్కులతో సంబంధం లేకుండా కేవలం జిజ్ఞాస, పట్టుదలతో అడుగులు వేసిన పవన్ కుమార్ చందన కథ.. నేడు కోట్లాది మంది యువతకు ఒక గొప్ప నిదర్శనం, స్ఫూర్తిదాయకంగా మారింది.

