India Sovereign Cloud: భారత ప్రభుత్వం తన డిజిటల్ భద్రత విషయంలో ఓ కీలకమైన అడుగు ముందుకు వేస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని (డేటా) భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన ‘సావరెన్ క్లౌడ్’ (సార్వభౌమ క్లౌడ్) ఫ్రేమ్వర్క్ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీని కోసం గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ప్రాథమిక చర్చలు ప్రారంభించింది. మన దేశం ఇప్పటికీ క్లౌడ్ మౌలిక వసతుల కోసం అమెరికాకు చెందిన AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రభుత్వ డిజిటల్ సేవలకు కూడా ఈ సంస్థల సేవలే కీలకంగా మారడంతో, సొంతంగా సార్వభౌమాధికారం కలిగిన క్లౌడ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం భారతదేశానికి అత్యంత ఆవశ్యకంగా మారింది.
ఈ సార్వభౌమ క్లౌడ్ అంటే కేవలం సర్వర్లను భారతదేశ సరిహద్దుల్లో ఉంచడం మాత్రమే కాదు. ఆ మౌలిక వసతులపై ఎవరి నియంత్రణ ఉంది, డేటాను ఎవరు యాక్సెస్ చేయగలరు, ఏ చట్టాలు వర్తిస్తాయి, ఆపరేషన్లు ఎవరు నిర్వహిస్తున్నారు? సాంకేతికత, సప్లై చైన్ ఎంతవరకు నమ్మదగినవి అనే విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని కోసం MeitY ఒక ప్రాథమిక ప్రతిపాదనను సిద్ధం చేసింది. త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖలతో, ఆ తర్వాత కొన్ని నెలల్లో పబ్లిక్ కన్సల్టేషన్ ద్వారా ప్రజా అభిప్రాయాలను కూడా తీసుకోనుంది. విదేశీ కంపెనీల నుంచి సాంకేతికత, సెక్యూరిటీ మోడల్స్పై సలహాలు తీసుకున్నప్పటికీ, డేటా భద్రత దృష్ట్యా తుది ఉత్పత్తులు, డేటా యాజమాన్యం ఖచ్చితంగా స్వదేశీ నియంత్రణలోనే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలక డేటాను కేవలం స్వదేశీ సార్వభౌమ క్లౌడ్లోనే భద్రపరచాలని సైబర్ రంగ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.ఎస్. నప్పిణై అభిప్రాయపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ఇటువంటి సాంకేతికతను అభివృద్ధి చేసే సామర్థ్యం భారత్కు పూర్తిస్థాయిలో ఉందన్నారు. ఈ కొత్త విధానం కింద క్లౌడ్ సేవలందించే సంస్థలు న్యాయపరమైన రక్షణలు, సాంకేతిక సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యం, ‘మేక్ ఇన్ ఇండియా’ భాగస్వామ్యం అనే నాలుగు ప్రధాన ప్రమాణాలకు లోబడి దాదాపు 46 సురక్షతా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం MeitY వద్ద నమోదు చేసుకున్న 29 కంపెనీలలో జియో ప్లాట్ఫామ్స్, యోటా డేటా సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్, సిఫీ, కంట్రోల్-ఎస్ వంటి అనేక స్వదేశీ సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి.
భారత ప్రభుత్వం నిర్వహించే డేటా పరిమాణం చాలా విస్తృతమైనది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) డేటా సెంటర్లలో 100 పెటాబైట్ల స్టోరేజ్ కెపాసిటీ, 5,000 కంటే ఎక్కువ సర్వర్లు ఉన్నాయి. ఆధార్, యుపిఐ, డిజిలాకర్, పాస్పోర్ట్, పన్ను వివరాలు, ఇ-కోర్టులు, రైల్వేలు, ఓటర్ ఐడీలతో పాటు రాష్ట్ర స్థాయి పోలీస్ (CCTNS), భూమి రికార్డులు వంటి సున్నితమైన సమాచారమంతా ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలపైనే నడుస్తోంది. ఉదాహరణకు 138 కోట్లకు పైగా ఆధార్ సంఖ్యలు, వేల కోట్ల యుపిఐ లావాదేవీలు, 72 కోట్లకు పైగా డిజిలాకర్ వినియోగదారుల వివరాలు ఈ వ్యవస్థల్లో ఉన్నాయి.
అయితే, డేటా మొత్తాన్ని ఒకే సర్వర్పై ఉంచకుండా, దాని సున్నితత్వాన్ని బట్టి వేర్వేరు రక్షణ స్థాయిలను కేటాయించనున్నారు. ఇప్పటికే ఉన్న నేషనల్ డేటా సెంటర్లు ISO 27001 సర్టిఫికేషన్ కలిగి ఉన్నప్పటికీ, ఇటీవల ఇమెయిల్ ఆధారిత ఫిషింగ్ దాడులు, పాస్వర్డ్ దొంగతనాల వంటి సంఘటనలు భద్రత ప్రాముఖ్యతను మరింత పెంచాయి. 2014లో ‘మేఘరాజ్’ పేరుతో ప్రారంభమైన జాతీయ క్లౌడ్ కార్యక్రమం నేడు వేలాది ప్రభుత్వ శాఖలకు సేవలు అందిస్తోంది. ఇప్పుడు భారత్ అడుగుపెడుతున్న ఈ ‘సార్వభౌమ క్లౌడ్’ విధానం ఫ్రాన్స్, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న స్వదేశీ డేటా భద్రతా విధానాల బాటలోనే సాగుతోంది.

