WTC Points Table 2025-27: ఇంగ్లండ్పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి.
చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేకపోయారు. 212 పరుగులకే ఆలౌటై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడిపోయింది. కివీస్ తరఫున జాక్ ఫౌల్క్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. కివీస్ పాయింట్ల శాతం 72.22కి పెరిగింది. మరోవైపు సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్ ఏడో స్థానంలోనే కొనసాగుతూ.. పాయింట్ల శాతం 24.36కి పడిపోయింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా 87.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా 75.00 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండి.. ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా నిలిచింది. ఇంగ్లండ్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్ (58.330) నాలుగో స్థానంలో ఉండగా.. భారత్ (48.150) ఐదవ స్థానంలో నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. టీమిండియా ఏకంగా 9 మ్యాచులు ఆడి నాలుగు విజయాలే అందుకుంది. డబ్ల్యూటీసీ 2025-27లో టీమిండియా చాలా వెనుకంజలో ఉంది. ఈసారి కూడా భారత్ ఫైనల్ ఆడడం కష్టంగానే ఉంది.

