ఐపీఎల్లో గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీలో ఫైర్ కనిపించింది. ముఖ్యంగా అభిమానులకు పాత కోహ్లీని గుర్తుకుతెచ్చాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తడంతో అతడి పేరిట రికార్డుల మోత కూడా మోగింది.
ఈ సీజన్లో ఇప్పటివరకు కోహ్లీ 14 మ్యాచ్లు ఆడి 309 పరుగులు చేశాడు. దీంతో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్రతి సీజన్లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గతంలో సురేష్ రైనా, శిఖర్ ధావన్ 12 సార్లు ఈ ఘనతను సాధించారు. వీళ్లిద్దరూ ఐపీఎల్లో 12 సార్లు 300కు పైగా పరుగులు పూర్తి చేశారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు కోహ్లీ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 పరుగులకు పైగా భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల భాగస్వామ్యాలను మూడు సార్లు నమోదు చేశాడు.
అటు ఐపీఎల్లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ అప్పటి నుంచి ఇదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 7వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 424 పరుగులు ఛాంపియన్స్ లీగ్లో సాధించగా.. మిగతా పరుగులు ఐపీఎల్లోనే చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ 7వేల పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు.