Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..

Agarkar And Vaibhav

Agarkar And Vaibhav

భారత క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల (Asian Games) టీ20 జట్లలో వైభవ్‌కు చోటు దక్కింది. ఈ ఎంపికతో 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్‌ బద్దలు కొట్టాడు. అతి పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన ఆటగాడిగా సరికొత్త చరిత్ర లిఖించాడు.

సెలక్టర్లను బలవంతం చేసిన ప్రదర్శన
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 16 మ్యాచ్‌లలో 48.50 సగటుతో, ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన ఫామ్ చూసి సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోకుండా ఉండలేకపోయారు.

×
×
Ad

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఫస్ట్ రియాక్షన్
ఈ యువ సంచలనం ఎంపికపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా స్పందించారు. వైభవ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ.. “వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్‌ లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో, ప్లేఆఫ్స్ దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టును అతడు ఒంటిచేత్తో నడిపించిన తీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అతడు మైదానంలోకి వస్తే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే అద్భుతమైన ‘గేమ్ ఛేంజర్’ అని అన్నాడు.

“అతడి వయసు చాలా చిన్నదే కావచ్చు, కానీ వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అతడు చూపించిన పరిణతి అసాధారణం. తన అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని జట్టులోకి ఎంపిక చేసేలా బలవంతం చేశాడు. టీ20 క్రికెట్ వీక్షించే ప్రతి ఒక్కరిలాగే మాకు కూడా అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి” అని అగార్కర్ స్పష్టం చేశారు.

భారత జట్ల వివరాలు..
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ప్రకటించిన భారత జట్లలో వైభవ్ సూర్యవంశీ కీలక ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో, జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లలో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అతడు తుది జట్టులోకి వస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టును శాసిస్తాడని అప్పుడే జోస్యం చెప్పడం విశేషం.