Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!

  • ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేయని వైభవ్
  • అవకాశం రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ
  • సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Ravichandran Ashwin on Vaibhav Sooryavanshi India Debut: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ రాలేదు. బుడ్డోడికి అవకాశం రాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత్ 0-2తో సిరీస్‌ను కోల్పోవడంతో అతడిని ఆడించాల్సిందని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం రాకపోవడం అతడి కెరీర్‌కు మేలు చేసిందని పేర్కొన్నాడు.

ఆడి విఫలమైతే:

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఆర్ అశ్విన్.. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసి రెండు మ్యాచ్‌ల్లో విఫలమై ఉంటే ప్రస్తుతం జరుగుతున్న చర్చ పూర్తిగా భిన్నంగా ఉండేదన్నాడు. ‘వైభవ్‌కు ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం ఇచ్చి.. అతడు విఫలమయ్యాడనుకోండి. అప్పుడు అందరూ ‘ఐపీఎల్‌లో మాత్రమే పరుగులు చేస్తాడు.. స్వింగ్, సీమ్ ఉన్న పిచ్‌లపై ఆడలేడు’ అని విమర్శించేవారు. ఇప్పుడు వినిపిస్తున్న మాటలన్నీ పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవి’ అని యాష్ వివరించాడు.

స్వింగ్ పిచ్‌లపై దూకుడు ఆట ప్రమాదం:

స్వింగ్, సీమ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో టీ20 ఫార్మాట్‌లో అదే దూకుడు ఆటను కొనసాగిస్తే వికెట్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్ అశ్విన్ చెప్పాడు. ‘స్వింగ్, సీమ్‌ పరిస్థితుల్లో వైభవ్ అయినా, అభిషేక్ శర్మ అయినా, సంజూ శాంసన్ అయినా ఒకే తరహా దూకుడు ఆట ఆడితే ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో డగౌట్లో కూర్చొని జట్టు వాతావరణాన్ని గమనించడం కూడా ఓ మంచి అనుభవమే’ అని పేర్కొన్నాడు.

తప్పిదాల నుంచి నేర్చుకోవడమే గొప్ప పాఠం:

వైభవ్ సూర్యవంశీకి ఈ సమయంలో దక్కుతున్నా అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని యాష్ అభిప్రాయపడ్డాడు. అత్యుత్తమ ఆటగాళ్ల తప్పిదాలను దగ్గరగా గమనించడం ద్వారా విలువైన పాఠాలు నేర్చుకోవచ్చని చెప్పాడు. ‘ఎవరినైనా అడిగితే ఇదే చెబుతారు. అత్యుత్తమ ఆటగాళ్లు చేసే తప్పులను దగ్గరగా గమనిస్తూ నేర్చుకునే పాఠాల కంటే గొప్పవి మరొకటి ఉండవు. అలాంటి అవకాశం వైభవ్‌కు ఇప్పుడు దక్కింది. ఇది అతడి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని అశ్విన్ వెల్లడించాడు.

అరంగేట్రం దక్కుతుందా?:

వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. బుధవారం (జూలై 1) నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో అతడికి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులంతా వైభవ్ టీమిండియా జెర్సీలో బరిలోకి దిగే క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కోచ్, కెప్టెన్ మాటలు చూస్తే.. మరోసారి బుడ్డోడికి నిరాశ తప్పదేమో.