ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి ఈ సీజన్లో ప్రతి జట్టూ 12 మ్యాచ్ లను పూర్తి చేసుకోగా వచ్చే వారంతో లీగ్ స్టేజ్ కు ఎండ్ కార్డ్ పడనుంది.
అయితే ఇప్పటి వరకు కేవలం ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్ మాత్రమే అర్హత సాధించింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కూడా దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. ఈ రెండు జట్లకు ఇదే తొలి ఐపీఎల్ అయినప్పటికీ అద్భుత ఆటతో ఆడి పాయింట్ల పట్టికలో టాప్ 2లో కొనసాగుతుండడం విశేషం. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా 6 జట్లు (ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్) బరిలో ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నాయి.
