NTV Telugu Site icon

Para Olympics 2024: నేటి నుంచి పారాలింపిక్స్‌.. భారత్ తరపున బరిలోకి 84 మంది అథ్లెట్లు

Paraolampics

Paraolampics

Para Olympics 2024: పారా ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడబోతున్నారు. ఇక భారత దేశం విషయానికొస్తే ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన ఇండియన్ అథ్లెట్లు ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Read Also: Fire Accident : ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం, 30 ఇళ్లు దగ్ధం.. కోట్ల ఆస్తి నష్టం

కాగా, ఈ సారి పారా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్‌ అంటిల్‌, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్‌ భారత పతాకధారులుగా కనిపించనున్నారు. వీరిద్దరిపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి ఖచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి, మరియప్పన్‌ తంగవేలు, డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్‌ కథునియా, ఆర్చరీ-కాంపౌండ్‌ నుంచి శీతల్‌ దేవి, కృష్ణ నాగర్‌, సుహాస్‌ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), భవీనాబెన్‌ పటేల్‌ (టేబుల్ టెన్నిస్) ముందు వరుసలో ఉన్నారు. అయితే, ఈ వేడుకలు భారత కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఆరంభం కానున్నాయి.